అమీర్పేట్: ఢిల్లీ కేంద్రంగా ఆయుర్వేద మందుల తయారీ సంస్థ జివిక ఆయుర్ సైన్సెస్ రాష్ట్రంలో రూ. 120 కోట్ల వ్యయంతో తన ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. సోమవారం బేగంపేట్లోని హోటల్ మటీసీ గ్రాండ్ కాకతీయలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను జివిక ఆయుర్ సైన్సెస్ వ్యవస్థాపకులు, సీఈవో ఎల్.మణివర్గీస్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిశ్రమ విషయమై పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ను కలిసి తమ ఆలోచనను వివరించామని, ఇందుకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వ్యక్తమైందని, ప్రభుత్వ సూచనల మేరకు పరిశ్రమ స్థాపనకు సూచించిన జీనోం వ్యాలీ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగిందని, ఇది ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వం నుండి ఇతర అనుమతులకు సంబంధించిన అంశాలు కూడా సరళతరంగా ఉండడంతో తమ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని విధాలుగా సానుకూల పరిస్థితులున్నాయని వివరించారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వనరులు, ఆయుర్వేద మందుల తయారీకి అనువుగా ఉన్న పరిస్థితులు, మార్కెట్, జాతీ, అంతర్జాతీయంగా అనుకూలంగా ఉన్న రవాణా సదుపాయాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడ తమ పరిశ్రమ స్థాపినకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. పరిశ్రమ స్థాపనకు సంబంధించిన అన్ని అనుమతులతో త్వరలోనే ఆయుర్వేద మందుల తయారీ పరిశ్రమతో పాటు పరిశోధన సంస్థ, గ్లోబల్ మార్కెటింగ్ హెడ్క్వార్టర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.