కొండాపూర్ : భారతదేశం భిన్న చారిత్రాత్మక కట్టడాలకు నిలయమై అర్కిటెక్చర్ హబ్గా ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం పొందిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర అర్కిటెక్చర్ కాలేజీ 25 వసంతాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలను ‘ప్రపంచ అర్కిటెక్చర్’ దినోత్సవాన నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భిన్న కట్టడాలకు నిలయంగా భారతదేశం ఉందని, ప్రాచీన కాలం నుంచే నిపుణులైన అర్కిటెక్చర్లు మన దేశంలో ఉన్నారన్నారు. ప్రపంచానికి నిపుణులైన అర్కిటెక్చర్లను అందిస్తు అర్కిటెక్చర్ హబ్గా మారిందన్నారు. అనంతరం కళాశాలలోని వివిధ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ని, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సురభి అజిత, ప్రిన్సిపాల్ కామిని సింగ్, బోధన సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.