తెలుగుయూనివర్సిటీ : రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సందర్బంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఇతర కార్యకర్తలతో కలిసి వచ్చిన మోత్కుపల్లి నర్సింలు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా నర్సింలు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్తో పనిచేయా లనే సంకల్పంతోనే పార్టీలో చేరుతున్నట్లు ఈ రోజు సంతోషకరమైన దినంగా చెప్పారు. ప్రతి వర్గానికి అండగా ఉన్న సీఎం కేసీఆర్ వంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. రైతులు అప్పుల బారినపడకుండా రైతు బంధు, దళిత బంధు, పేద పిల్లల పెండ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఇంటింటికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు తదితర పథకాలు దేశంలో ఎక్కడాలేవన్నారు.
రాష్ట్ర సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు అండగా ఉన్న సీఎం కేసీఆర్తో పనిచేయాలనే సంకల్పంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.