మియాపూర్ : ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం ఆరోగ్య పెన్నిధిలా ఉపయోగపడుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా వందలాది మంది పేదలకు భరోసాగా నిలిచి ఆరోగ్యాలకు స్వస్థత చేకూర్చుకునేందుకు దోహదపడిందన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు సీఎం సహాయ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 5లక్షల నిధుల మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచేలా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. ఆస్పత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ఈ ఆర్థిక సాయం సంజీవనిలా అండగా నిలుస్తున్నదని విప్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఊట్ల చంద్రారెడ్డి, శ్రీను, పోతుల రాజేందర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.