గోల్నాక : బస్సు నడుపుతుండగా ఒక్క సారిగా డ్రైవర్కు గుండె పోటు రావడంతో వెంటనే అది గమణించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
అంబర్పేట పోలీసులు, ప్రయాణీకులు తెలిపిన కథనం ప్రకారం… ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్ నుంచి హన్మకొండకు ప్రయాణీకులతో ఆర్టీసీ బస్సు (టీఎస్ 03జడ్ 0393) అంబర్పేట మీదుగా వెళ్తోంది. ఈ క్రమంలో అంబర్పేట గాంధీ బొమ్మ చౌరస్తా సమీపానికి రాగానే బస్సు నడుపుతున్న డ్రైవర్ సీహెచ్.శ్రీనివాస్ (48)..కు ఒక్క సారిగా గుండె నొప్పి వచ్చింది.
నొప్పిని బరిస్తూనే డ్రైవర్ క్షణాల్లో బస్సును పక్కకు ఆపి స్టీరింగ్పై కుప్పకూలాడు. వెంటనే గ్రహించిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ శ్రీనివాసును చికిత్స నిమిత్తం అంబులెన్సులో తార్నాకలోని ఆర్టీసీ దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం దవాఖానలోని ఐసీయూలో అతనికి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రాణాపాయం ఏమీలేదని అక్కడి వైద్యులు తెలిపారు.