ముషీరాబాద్ : సామాజిక స్పూర్తితో సాగిన గురజాడ అప్పారావు సాహిత్యం నిత్య నూతనమని అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రముఖ కవి గురజాడ అప్పారావు జయంతి సభ చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. దేవులపల్లి ప్రభాకరరావు ముఖ్య అతిధిగా పాల్గొని గురజాడ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గురజాడ సాహిత్యం సామజిక బాధ్యత, సమానత్వాన్ని చాటుతుందన్నారు. మూఢ నమ్మకాలతో కొనసాగుతున్న సమాజం మేల్కొనేలా రచనలు, ఉద్యమాలతో ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొత్తూరి సుబ్బారావు, భమిడి ఉష, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.