చార్మినార్ : నగరంలోని బాలపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. 75 వసంతాల స్వాతంత్ర్య భారతావనికి వందనం చేస్తూ సాయి రాజశేఖర్ (22) కశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు సుమారు 3500 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన 75 రోజుల్లో చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు.
గత సెప్టెంబర్ నెలలో నగరం నుండి కశ్మీర్కు బయలుదేరిన సాయి రాజశేఖర్ ఆదే నెల 16వ తేదిన తన నడక యాత్రను ప్రారంభించారు.51 రోజుల్లో 2400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శుక్రవారం చారిత్రక చార్మినార్ వద్దకు చేరుకున్నారు.
సాయి రాజశేఖర్ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ చార్మినార్ అడిషనల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జానకమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మీ ట్రస్టీ శశికళలు సాయి రాజశేఖర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయి రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో 82 రోజుల్లో ఓ మహిళ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించిందని తెలిపారు.
తన పేరిట మరో రికార్డును నెలకొల్పడానికి ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. భారత స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తిచేసుకున్న తరుణంలో తన యాత్రను 75 రోజుల్లో కశ్మీర్ నుండి కన్యాకుమారిని చేరుకోవడమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలిపారు.