ప్రమాధ స్థాయికి చెరువులు
భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
బడంగ్పేట:ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బాలాపూర్ మండలంలో ఉన్న చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వరద నీటితో చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. బాలాపూర్ మండలంలో ఉన్న 42 గొలుసు కట్టు చెరువులన్నీ కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. చాలా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ప్రధాన రహాదారులలోకి నీళ్లు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వరద నీటిని పూర్తిగా దిగువకు వదిలితే లోతట్టు ప్రాంతాలైన సీఎంఆర్, మధురపురి, బోయపల్లి ఇన్క్లెవ్, రామిడి మల్లారెడ్డి కాలనీ, సివైఆర్, అమరావతి, బాలాజీ నగర్, ఎంఎల్ఆర్ కాలనీ, కమలా నగర్, లక్ష్మి నగర్ తదితర కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకునే ప్రమాధం ఉంది. నీళ్లు వదలక పోతే ఎగవన ఉన్న కాలనీలు మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ, జయశంకర్ కాలనీ, వైఎస్ఆర్ నగర్ ఫేస్ -1, ఫేస్2 కాలనీలు ,నవయుగ కాలనీ, శివనారాయణ పురం ముంపునకు గురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు భారీగా వచ్చి చెరువులలో చేరుతుంది.
భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న అన్ని చెరువులు ప్రమాధకర స్థాయికి చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చెరువు కట్టలు తెగిపోతాయన్న భయం వారిని వెంటాడుతోంది. గతంలో జరిగిన ముంపు సమస్య గుర్తు చేసుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలుగు నుంచి వస్తున్న నీళ్లతో ఇప్పటికే కాలనీలు జలమయమయ్యాయి.ఇదే విధంగా వర్షాలు కురిస్తే పరిస్థతి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీటి తోపాటు గతంలో నెలల తరబడి చాలా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మరో సారి అదే పరిస్థితి పునరావృతం అయితే తమ పరిస్థితి ఏంటని ప్రజలు అవేదన చెందుతున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిః అధికారులు
బాలాపూర్ మండలంలో ఉన్న 42 గొలుసు కట్టు చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాధం ఉందని వాతావరణ శాఖ సూచించిందని అధికారులు చెప్తున్నారు. అల్మాస్గూడలో ఉన్న చెరువులు మత్తడి దుంకుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
వర్షం ఇలాగే కురిస్తే అన్ని చెరువులు ప్రమాధకరంగా మారుతాయని అధికారులు చెప్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 24 గంటలు ప్రజలకు అంధుభాటులో ఉండాలని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని అధికారులు పేర్కొంటున్నారు. అవసరం అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తుగు సూచనలు చేశారని అధికారులు చెప్తున్నారు.