హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్నగర్లోని మదర్ డెయిరీలో నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం నూతన చైర్మన్గా గంగుల కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా మంత్రి జగదీశ్వర్రెడ్డి, విశిష్ట అతిథులుగా రాజ్యసభ సభ్యుడు బుడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, రవీందర్ నాయక్, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, మదర్ డెయిరీ సంస్థ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మదర్ డెయిరీ సంస్థ మిగతా సంస్థలకు పోటీ పడేలా ముందుకెళ్తుందన్నారు. పాల ఉత్పత్తిదారులు, ఉద్యోగులు సంస్థ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, సంస్థ మూతపడితే రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మూతపడ్డ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేసి ఉద్యోగులకు అండగా నిలిచారని కొనియాడారు. పాడి రైతులు, ఉద్యోగులు సమష్టి కృషితో ముందుకెళ్లినప్పుడే సంస్థ అభివృద్ధి బాటలో సాగుతుందన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తి రంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో నీలి విప్లవం, క్షీర విప్లవం మాదిరిగానే తెలంగాణ ఉద్యమంలా సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధిలో తీసుకెళ్తున్నారని వెల్లడించారు. వ్యవసాయ రంగం మాదిరిగా పాడి పరిశ్రమకు కూడా ప్రభుత్వం తోడుగా నిలుస్తూ ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. ఈ అవకాశాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాం : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి
ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలో పాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాకు మంచిరోజులు వచ్చాయని వలస వెళ్లిన వారు మళ్లీ తమ గ్రామాలకు వచ్చి వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. పాల ఉత్పత్తుల్లో తమ నియోజకవర్గం అయిన ఆలేరు ముందుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చల్లా సురేందర్రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, కోట్ల జలేందర్రెడ్డి, గూడూరు శ్రీధర్రెడ్డి, కే.జయశ్రీ, కే.అలివేణి, సొసైటీ అధ్యక్షులు, పాడి రైతులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిరణ్కుమార్రెడ్డి, వెంకట్రెడ్డి, భాస్కర్సాగర్, బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.