తెలుగుయూనివర్సిటీ: ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య నేటి తరం సాహితీవేత్తలకు స్పూర్తిదాయకమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య స్మారకోపన్యాసం వర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ సంపత్కుమారాచార్య సాహిత్యమే జీవితంగా కొనసాగించారన్నారు. నిరాడంబరుడైన ఆయన సాహిత్యలోకంలో విహరింపజేశారని పేర్కొన్నారు. పద్య కవిత్వంలో, సాహిత్యంలో పరిశోధనకు ఆయన స్పూర్తిని కలిగించారని రమణాచారి గుర్తు చేశారు. సంపత్కుమారాచార్య సాహితీవేత్తనే కాదు సంఘసంస్కర్త కూడా అని తెలిపారు.
వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య టి. కిషన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణరావు పాల్గొని సంపత్కుమారాచార్య పద్యాలు-ప్రయోగాలు అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. రహదారులు,భవనాల శాఖ పూర్వ పర్యవేక్షక ఇంజనీర్ డి. లక్ష్మణాచార్యులు, విస్తరణ సేవా విభాగం ఇంచార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.