బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం బుధ, గురువారాల్లో 50 మంది కొత్తగా కొవిడ్ పాజిటివ్తో దవాఖానాలో వచ్చి చేరారని, అందులో కొందరు సీరియస్గా ఉన్నారని అన్నారు.
బ్లాక్ ఫంగస్తో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారన్నారు. వివిధ ఆనారోగ్య సమస్యలతో ప్రస్తుతం 774 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అన్ని వైరస్లా మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ కూడా కొవిడ్ మాదిరిగానే లక్షణాలు కలిగి ఉందని, ప్రజలు జాగ్రతలు తీసుకుంటేనే దానిని రాకుండా అరికట్టగలమని ఆయన అన్నారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు నిర్వహించిన జూమ్ మీటింగ్లో తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, తమకు అనేక ముఖ్యమైన సూచనలు చేశారని, తాము వాటిని తప్పకుండా అమలుచేస్తామని అన్నారు.
జిల్లా దవాఖానాలలో కూడా కొవిడ్ వార్డులను ఏర్పాటు చేయాలని, తద్వారా గాంధీ దవాఖానపై అదనపు భారం తగ్గుతుందని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారని డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రస్తుతం గాంధీలో 600 ఐసీయూ, 600 ఆక్సిజన్, 600 సాధారణ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
గంటకు ఏడు టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే ఎనిమిది ప్లాంట్లు కూడా సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు. సంక్రాంతి పండగకు సొంత ఊరికెళ్ళే వారు జాగ్రత్తలను పాటించాలని ఆయన సూచించారు.