కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, సంక్రాంతి నుంచి ఉగాది వరకు 11 ఆదివారాల పాటు ఉత్సవాలను పాలక వర్గం నిర్వహించనున్నది. బ్రహ్మోత్సవాల్లో పట్నం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు కీలకమైనవి. స్వామి వారి కల్యాణోత్సవ ఏర్పాట్ల విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు అంచనా వేశారు. 50వేల లడ్డూల తయారు చేయించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
చేర్యాల, డిసెంబర్ 24: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయ్యింది. ఈ నెల 26న మల్లన్న కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి ఉత్సవాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 11 ఆదివారాల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయవర్గాలు స్వామివారి క్షేత్రంలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలతో పాటు రాజగోపురం, రాతిగీరల మండపం, కోడెల స్తంభం, గదులకు మరమ్మతులు, రంగులు తదితర పనులను చేస్తున్నారు. కల్యాణోత్సవానికి 50వేల మంది భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్ద పట్నం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో కీలకమైనవి కావడంతో భక్తులు భారీగా స్వామివారి క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. స్వామివారి పెండ్లి పత్రికలను ఆలయవర్గాలు పంపిణీ చేసి ఆహ్వానిస్తున్నారు. కాగా, శుక్రవారం మల్లన్న క్షేత్రంలో చేపట్టిన పనులను ఆలయ చైర్మన్ గీస భిక్షపతి పరిశీలించారు.
పార్కింగ్ స్థలాల ఏర్పాటు..
స్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారి వాహనాలను నిలిపేందుకు మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పెట్రోల్ పంపు, ఆర్టీసీ బస్స్టేషన్, మల్లన్న చెరువు ప్రాంతంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. అక్కడే తాత్కాలిక టాయిలెట్స్, నీటి వసతి కల్పించారు. వీటితో పాటు స్వామి వారి క్షేత్రంలో రెండు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇద్దరు వైద్యులు, సిబ్బంది 24గంటల పాటు మందులతో సిద్ధంగా ఉంటారు. కరోనా టీకాలు వేయించుకున్న వారు తప్పక వారి ధ్రువీకరణ పత్రాలు చూపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. డోస్ వేసుకోని వారికి, మాస్క్ లేనివారికి దర్శనం ఉండదని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. స్వామివారి క్షేత్రంలో దాతలు నిర్మించిన 150 కాటేజీలు సిద్ధంగా ఉన్నట్లు, దాతలు రాని పక్షంలో వాటిని భక్తులకు కేటాయించనున్నారు. భక్తుల కోసం 50వేల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి క్షేత్రంలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ఓ ఫైరింజన్ సిద్ధం చేశారు. భక్తుల రక్షణ కోసం స్వామివారి క్షేత్రంలో మొత్తం 27 సీసీ కెమెరాలు అమర్చారు.
పోలీసులు ప్రత్యేక శ్రద్ధ
మల్లన్న క్షేత్రంలో భక్తులకు శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్, సీఐ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు క్షేత్రంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. వివిధ క్యాడర్లకు చెందిన 250 మంది పోలీసులు స్వామివారి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం విధులు నిర్వహించనున్నారు. రోజువారీగా చేర్యాల నుంచి కొమురవెల్లి మీదుగా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, ప్రైవేట్ వాహనాలను దేవాదుల కాల్వల రోడ్డు వెంట పంపించేందుకు కొమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
కల్యాణోత్సవానికి 50 వేల మంది భక్తులు
స్వామి వారి కల్యాణోత్సవానికి 50వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వశాఖ అధికారులు వారికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారీకేడ్లు, షామియానాలు, పచ్చదనం ఉట్టిపడే విధంగా పలు ఏర్పాట్లు చేస్తున్నారు. గంగరేగు చెట్టు, కల్యాణ వేదిక, ప్రసాదాల విక్రయశాల వద్ద చలువ పందిళ్లు తదితర వసతులు కల్పించారు. కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు గోదావరి జలాలను అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 45 నల్లాలను ఏర్పాటు చేశారు. దీనికితోడుగా ఆలయవర్గాలకు చెందిన 18 బోర్లు, 15 నీటి ట్యాంకులు, 50 కులాయిలు సిద్ధం చేశారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో అలూరి బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. 3 సులభ్ కాంప్లెక్స్లు, బస్ స్టేషన్ వద్ద 40 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు భక్తుల స్నానాల కోసం 200 షవర్స్ ఏర్పాటు చేశారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులు కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజీవ్ రహదారిలోని మల్లన్న స్వాగత తోరణాల వద్ద అన్ని ఆర్టీసీ డిపోల బస్సులు నిలుపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఇప్పటికే లేఖలను పంపించారు. స్వామి వారి క్షేత్రంలోని సీసీ రోడ్లను శుభ్రం చేయడం, ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తోటబావి వద్ద నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక, ఆలయ సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
హాజరు కానున్న ప్రముఖులు..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు జరుగనున్న స్వామివారి కల్యాణ తంతుకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు హాజరుకానున్నారు. కాగా, స్వామివారి కల్యాణోత్సవానికి ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
ఈ ఏడాది 11 ఆదివారాలు..
ఈ ఏడాది 11 ఆదివారాల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. జనవరి 16న పట్నంవారం (మొదటి ఆదివారం), 17న హైదరాబాద్ భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండం, 23న లష్కర్ వారం (రెండో ఆదివారం), 30న మూడో ఆదివారం, ఫిబ్రవరి 6న 4 ఆదివారం, 13న ఐదో ఆదివారం, 20న ఆరో ఆదివారం, 27న ఏడో ఆదివారం, మార్చి 1న మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నం, 6న ఎనిమిదో ఆదివారం, 13న తొమ్మిదో ఆదివారం, 20న పదో ఆదివారం, 27న 10వ ఆదివారం (అగ్నిగుండాలు) నిర్వహించనున్నారు.
ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
మల్లికార్జున స్వామి వారి కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి, సిబ్బందితో కలిసి అన్నిఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు క్షేత్రంలో పనులు చేపడుతున్నాం. జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులతో అన్ని వర్గాల ప్రజలతో కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
వైభవంగా మల్లన్న కల్యాణం ..
కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. భక్తుల సేవే లక్ష్యంగా పాలక మండలి ముందుకు సాగుతున్నది. మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల సహకారంతో కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. భక్తుల వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు భక్తులకు అందిస్తాం.