సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశు సంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్పుర కృష్ణకాలనీలో కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్లో రూ. 17.36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టి న జీ+3 అంతస్తుల గల 8 బ్లాక్ లలో నిర్మించిన 168 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, శాసనసభ్యులు సాయన్నలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా ఉందని ఇక్కడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నిధులు తెచ్చే అవకాశం లేదన్నారు. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. కంటోన్మెంట్ ఏరియా పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని జీహెచ్ఎంసిలో విలీనం అయితే పేదలకు మరిన్ని గృహాలు నిర్మించి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. తద్వారా పేదలు గొప్పగా బ్రతికే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగతా ప్రాంతాలలో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయని తలసాని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. పేదలు ఆత్మాభిమానంతో గొప్పగా బతకాలనే ముఖ్యమంత్రి ఆశయంతో రెండు పడకల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. రెండు పడకల గృహాల కాలనీలకు విద్యుత్తు, తాగునీరు, సీసీ రోడ్లు సదుపాయాలను కల్పించామన్నారు. ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు 56 గృహాలను మంత్రి మంజూరు చేశారు. రెండు పడక గదుల ఇళ్లపై ప్రతిపక్షాలు చాలా మాట్లాడుతున్నారని, వారు ఇక్కడికి వచ్చి చూడాలన్నారు. వారికి పేదలు గొప్పగా బతకాలనే ఆలోచన లేదని గత ప్రభుత్వాల హయాంలో లబ్ది దారులకు కొంత శాతం సబ్సిడీతో మంజూరు చేసేవారని కానీ ఈ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా రెండు పడకల గదులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ నిరుపేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతు బందు, రైతు భీమా పథకాలతో పాటు ఆసరా ఫించన్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు మరెక్కడా లేవన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి నిధులు మంజూరు కాక అభివృద్ధి జరగ లేదని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి కృషి చేసింద న్నారు.. ధనవంతులు నివసించే గృహాల మాదిరిగా డబుల్ బెడ్ రూం గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
గతంలో ఈ కాలనీ ప్రజలకు అడ పిల్లలను ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని, ముఖ్యమంత్రి కృషి మేరకు పేదలకోసం రెండు పడకల గృహాలను నిర్మించి పంపిణీ పండుగ వాతావరణంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మరోక 56 గృహాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. కరోనా వ్యాధి మూలంగా నిర్మాణ పనులు జాప్యం జరగడానికి కారణమన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. కేసీఆర్ పాలనలో పేదల కోసం ఎక్కడ లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు 168 మంది లబ్దిదారులకు ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసి హౌసింగ్ ఓఎస్డీ శంకరయ్య, అర్డీఓ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.