కొండాపూర్ : వినాయక శరన్నవరాత్రులను పురస్కరించుకుని గణపయ్య నిమజ్జనానికి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన నిమజ్జన కోనేరులో సెప్టెంబర్ 12 నుంచి ఆదివారం సాయంత్రం వరకు 1100లకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు ఇంజనీరింగ్ ఏఈ జగదీశ్ తెలిపారు.
నిమజ్జనాలు పూర్తైన వెంటనే విగ్రహ, ఇతర వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనానికి విచ్చేస్తున్న భక్తుల కోసం అన్నీఏర్పాట్లు చేయడంతో పాటు ఆలస్యంగా వస్తున్న వారికి సైతం ఇబ్బందులు తలెత్తకుండా కోనేరు వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జన కోనేరు వద్ద సౌకర్యాలను ఎప్పటికప్పుడు సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్నతో పాటు ఏఎంహోచ్ఓ డాక్టర్ రవి తదితరులు పరిశీలించారు.
గంగారం పెద్ద చెరువులో…
చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని చందానగర్ డివిజన్ గంగారం పెద్ద చెరువులో ఏర్పాటు చేసిన నిమజ్జన కోనేరులో ఆదివారం వరకు 1200లకు పైగా గణపయ్య విగ్రహాల నిమజ్జనం పూర్తైనట్లు ఇంజనీరింగ్ ఏఈ రమేశ్ తెలిపారు. చందానగర్తో పాటు చుట్టు ప్రక్కల నుంచి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్కిల్ డీసీ సుధాంషు పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.