ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సరూర్నగర్ డివిజన్కు చెందిన బీజేపీ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ లో చేరడానికి కారణం అందెల శ్రీరాములుతో పాటు జిల్లా నాయకుల వ్యవహార శైలి అని కార్పొరేటర్ శ్రీవాణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన అందెల శ్రీరాములు యాదవ్ అనుచరులు ఆదివారం రాత్రి కార్పొరేటర్ శ్రీవాణి ఇంటిపై దాడి చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
ఈ విషయాన్ని సరూర్నగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్నవారిని పంపించేశారు. డివిజన్లో బీజేపీకి బలం లేకుండా చేయాలని కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
నాయకులకు షోకాజ్ నోటీసులు..
కాగా సరూర్నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై దాడి చేసిన సొంత పార్టీ నాయకులపై బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నది.
ఎల్బీనగర్, మన్సూరాబాద్, చంద్రపురికాలనీలోని రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా అందుబాటులో ఉన్న నేతలతో రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్పొరేటర్ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనలో నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.