బేగంపేట్ : ప్రజలు సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు.
మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట్ డివిజన్ ఖండోజి బజార్లో రూ.8.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న సీవరేజ్ పైపులైన్ పనులు, అలాగే రూ.7.80 లక్షలతో చేపట్టనున్న వాటర్లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్లతో కలిసి శంఖుస్థాపన చేశారు.
ఈ సంధర్భంగా మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతానికి చెత్తను తీసుకువెళ్లే వాహనం సక్రమంగా రావడం లేదని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే శానిటేషన్ అధికారులతో మాట్లాడి వాహనం క్రమం తప్పకుండ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన మంత్రి నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలర్టుగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మహంకాళి సీఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.