కొండాపూర్ : అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ప్రజా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని చందానగర్ డివిజన్లో కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, అధికారులతో కలిసి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సూచించారు. ఇందులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం వీకర్ సెక్షన్, వేమన వీకర్ సెక్షన్, వేమనరెడ్డి కాలనీల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఎస్టీపీ ప్లాంట్ పరిశీలన….
చందానగర్ డివిజన్ పరిధిలోని వేమనరెడ్డి కాలనీలోని నీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ప్లాంట్ను అధికారులు, కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పరిశీలించారు. స్థానికులకు మురుగునీటి ఇబ్బందులు, దుర్వాసనలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్లాంట్ నిర్వహణ అధికారులకు ఆయన సూచించారు.
ప్లాంట్ చుట్టూ మొక్కల పెంపకం ద్వారా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.