హయత్నగర్ : డ్రైనేజీ ట్రంక్లైన్తో సమస్య శాశ్వత పరిష్కారమవుతుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మంగళవారం బిఎన్రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ కల్వర్టు నుండి ఫారెస్ట్ మీదుగా బిఎన్రెడ్డి నగర్ ఫేజ్-3 పార్కు దగ్గరున్న డ్రైనేజీ ట్రంక్లైన్ వరకు, ఎస్కెడినగర్లోని దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ నుండి వైదేహి నగర్ మీదుగా శాతవాహన నగర్ కాలనీలోని వివేకానంద విగ్రహం వరకు రూ.72.10 లక్షలతో నిర్మిస్తున్న నూతన డ్రైనేజీ ట్రంక్లైన్ నిర్మాణం కోసం స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ నిచ్చారు. డ్రైనేజీ ట్రంక్లైన్ పనులు పూర్తయితే ముంపు సమస్యల నుండి విముక్తి లభిస్తుందని తెలిపారు. సాగర్ కాంప్లెక్స్ నుండి వచ్చే వరదనీటిని కాప్రాయ్ చెరువులోకి రాకుండా గురంగూడ ఫారెస్ట్ నుండి విపశ్యన ధ్యాన కేంద్రం మీదుగా దిగువన ఉన్న గాయత్రినగర్ ఫేజ్-3, క్రిస్టల్ అవెన్యూ నుండి రాచకాలువ గుండా తీసుకెళ్లి మునగనూర్ మీదుగా పెద్దఅంబర్పేట శివారులో కలుస్తుందన్నారు.
దీంతో హరిహరపురం, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, అఖిలాండేశ్వరి నగర్, స్నేహమైనగర్, పీవీఆర్ కాలనీ, అనంతవేణి నగర్, సామనగర్, శారదానగర్ వాసులకు వరదనీరు, డ్రైనేజీ సమస్య తీరుతుందని వివరించారు. కాప్రాయి చెరువు నుండి దిగువ కాలనీలకు వచ్చే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషిచేస్తున్నానని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎన్రెడ్డినగర్ టీఆర్ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మాదవరం నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.