బేగంపేట్ : వర్షాకాలంలో బేగంపేట్ నాలా పరిసరాల్లో తలెత్తే వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ. 45 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఈ నెల 7న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్తో పాటు జలమండలి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి తలసాని బేగంపేట్ నాలా పరిసరాల్లో ఉన్న కాలనీల సమస్యలను వివరించారు. అంతేకాక సమస్య తీవ్రతను పురపాలక మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో బేగంపేట్ నాలా పరిసర ప్రాంతాల ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.45 కోట్ల నిధులను విడుదల చేసింది.
నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం కింద మంజూరైన ఈ నిధులతో వరద ముంపు సమస్య తీవ్రత అధికంగా ఉన్న బ్రాహ్మణవాడి, ప్రకాష్నగర్, అల్లంతోట బావి, మాతాజీనగర్ ప్రాంతాల్లో వరదనీటి పైపులైన్లు పూర్తి స్థాయిలో చేపట్టడంతో బేగంపేట్ నాలా రీటైనింగ్ వాల్ నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కార్యాలయ అధికారులు తమ ప్రకటనలో తెలిపారు.
బేగంపేట్ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రి తలసాని తీసుకున్న చొరవతో పెద్దమొత్తంలో నిధులతో పాటు చక్కటి వరదనీటి పైపులైను వ్యవస్థ రూపుదిద్దుకుంటే తమకు వరద ముప్పు తప్పుతుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారని కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి తెలిపారు.