కొండాపూర్ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ అభివృద్ధికి రూ. 4.09 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధానత్యనిస్తూ ముందుకు సాగుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నా మన్నారు. భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన దిశగా పనులు ప్రారంభిస్తున్నామన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో మెరుగైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చందానగర్ డివిజన్లో సమస్యలుగా మారిన పలు ప్రాంతాల్లో యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.