యాదగిరిగుట్ట రూరల్, మే 8 : మండలంలోని మల్లాపురంలో జరుగనున్న కొత్త విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి బొడ్రాయి ప్రతిష్ఠ చేశారు. కార్యక్రమానికి గ్రామస్తులు, బంధువులు, ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే సంప్రదాయ పద్ధతుల్లో పుణ్యస్నానాలు ఆచరించి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. యాగశాలలో హోమం నిర్వహించారు. అష్టదిగ్బంధనం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పోచమ్మ, గట్టు మైసమ్మ, పెద్దమ్మలకు యంత్రప్రతిష్ఠ చేశారు. రామ్మోహన్శర్మ ఆధ్వర్యంలోని 15 మంది పురోహితులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య, ఎంపీటీసీ కర్రె విజయ, మాజీ జడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఉప సర్పంచ్ పల్లెపాటి మాధవులు, ఉత్సవ కమిటీ సభ్యులు పల్లెపాటి బాలయ్య, గోపగాని గోపాల్, కర్రె సత్తయ్య, కిష్టయ్య, స్వామి పాల్గొన్నారు.
గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల ఉత్సవాలకు రావాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఒగ్గు భిక్షపతి కోరారు. నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట గడసంతల శ్రీశైలం, మారబోయిన బాలరాజు ఉన్నారు.