యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, బస్బే, ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
యాదాద్రి, మే 8 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయంలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అర్చకులు సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్, మే 8 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని కాకినాడ జీయర్ ఆశ్రమానికి చెందిన శ్రీ త్రిదండి రంగ రామానుజ జీయర్ స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభువులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ఆలయ ముఖమండపంలో ప్రవచనాలు చేశారు.