యాదాద్రి, మే 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, తిరువారాధన నిర్వహించారు. ఉదయం ఆరగింపు చేపట్టిన స్వామివారికి అనంతరం నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేపట్టి, భక్తులకు స్వయంభూ దర్శనాలను కల్పించారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు స్వామివారికి మధ్యాహ్నం ఆరగింపు చేపట్టి, దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం, సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలు, సర్వ దర్శనాలు కొనసాగాయి. రాత్రి తిరువారాధనలు చేపట్టి, స్వామి, అమ్మవార్లకు సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు జరిపారు.
ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.14,02,003 ఆదాయం వచ్చి నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ప్రధానాలయంలో శ్రీరామానూజ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం అభిషేకం సమయంలో నవకలశ తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం రామానూజ ఆళ్వారులకు పురప్పాట్ సేవ చేశారు. అనంతరం స్వామివారిని ముఖ మండపంలో వేంచేపు చేసి ఆరాధన చేపట్టారు. రాత్రి నివేదనతో ఉత్సవాలకు ముగింపు పలికారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,34,550
వీఐపీ దర్శనం 43,500
వేద ఆశీర్వచనం 4,800
సుప్రభాతం 5,100
క్యారీబ్యాగుల విక్రయం 15,400
వ్రత పూజలు 88,800
కల్యాణకట్ట టికెట్లు 29,200
ప్రసాద విక్రయం 7,66,600
వాహనపూజలు 9,700
అన్నదాన విరాళం 10,717
సువర్ణ పుష్పార్చన 1,17,916
యాదరుషి నిలయం 68,040
పాతగుట్ట నుంచి 29,780
కొండపైకి వాహన ప్రవేశం 77,000
లక్ష్మీపుష్కరిణి 600