యాదాద్రి, మే 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ జరిపించారు. తిరువారాధన నిర్వహించి ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామివారి సువర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. స్వామి, అమ్మవార్లకు సుదర్శన నారసింహ హోమం జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలు స్తూ హోమం చేశారు.
అనంతరం ప్రాకార మండపంలో నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను వైభవంగా నిర్వహించారు. యాదాద్రి కొండకింద పాత గోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రి కొండపై ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో ప్రభాత వేళ పరమశివుడిని కొలుస్తూ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సుమారు గంటన్నరపాటు జరిగింది. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి, మహా గణపతి, ఆంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాలను అభిషేకించి అర్చన చేశారు. ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. స్వామివారి ఖజానాకు రూ. 23,46,955 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహుడిని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఆయన ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,01,250
వేద ఆశీర్వచనం 6,000
సుప్రభాతం 2,000
క్యారీబ్యాగుల విక్రయం 19,200
వ్రత పూజలు 1,72,800
కల్యాణకట్ట టిక్కెట్లు 46,800
ప్రసాద విక్రయం 13,49,500
వాహనపూజలు 12,400
అన్నదాన విరాళం 14,473
సువర్ణ పుష్పార్చన 1,24,232
యాదరుషి నిలయం 95,070
పాతగుట్ట నుంచి 32,430
లీసెస్, లీగల్ 500
గోపూజ 300
కొండపైకి వాహన ప్రవేశం 1,50,000