యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు సెలవు రావడం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్యూలైన్లు నిండిపోయాయి.. ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
యాదాద్రి, ఏప్రిల్ 24 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నర్సింహస్వామి దర్శనానికి భక్తులు ఆదివారం బారులు దీరారు. సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసినా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబసభ్యులతో వచ్చిన భక్తులు గంటల కొద్దీ క్యూలో నిలుచుని శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున 3.30గంటలకు మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు చేసి స్వయంభువులను అభిషేకించారు. ఉదయం సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీవారిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, హారతి నివేదనలు చేశారు. సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. స్వయంభూ ప్రాకార మండపంలో ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు.
కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు జరిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యపూజల కోలాహలం నెలకొంది. శ్రీవారి ఖజానాకు రూ. 29,00,477 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,47,000
వీఐపీ దర్శనాలు 4,80,000
వేద ఆశీర్వచనం 1,800
నిత్యకైంకర్యాలు 3,301
సుప్రభాతం 10,000
క్యారీబ్యాగుల విక్రయం 21,000
వ్రత పూజలు 1,44,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 48,400
ప్రసాద విక్రయం 14,60,350
వాహనపూజలు 18,400
అన్నదాన విరాళం 28,474
శాశ్వత పూజలు 15,000
సువర్ణ పుష్పార్చన 1,92,812
యాదరుషి నిలయం 76,760
పాతగుట్ట నుంచి 5,148
గోపూజ 300