యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నేడు పునఃప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలుగనుంది. శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10.25 గంటలకు ధనిష్ఠా నక్షత్ర సుముహూర్తాన శ్రీరాంపురం (తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా స్ఫటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రికి రావడం ఇది 20వ సారి. ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు.
పరమేశ్వరుడికి ప్రీతికరమైన శతరుద్రాభిషేకం.. ప్రతిష్ఠామూర్తులకు రుద్రహవనాలు.. ప్రాసాద స్నపనాలు.. శిలామయ, లోహమయ బింబాలకు అధివాస కార్యక్రమాలతో రామలింగేశ్వరాలయంలో ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. బాలశివాలయంలో శివుడికి నిత్యారాధనల అనంతరం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాగశాల ద్వార తోరణపూజ శతరుద్రాభిషేకం, మహారుద్రపురశ్చరణ, మూలమంత్రానుష్ఠాన వేదహవనాలు అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు రుద్రహవనం, ప్రాసాదస్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికాస్థాపనలు, శయ్యాధివాసం, పుష్పాధివాసం, ప్రాసాదాధివాస వేడుకలు ఘనంగా జరిగాయి.
అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, యజ్ఞబ్రహ్మ బండారు శేషగిరిశర్మ, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నరసింహరామ శర్మ, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, ఏఈఓ దోర్భల భాస్కర్శర్మ, యాజ్ఞీకులు, రుత్వికులు, పారాయణీకులు, వేద పండితులు,
అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు.
– యాదాద్రి, ఏప్రిల్ 24
శాస్ర్తాను సారంగా నూతన శివాలయం ప్రతిష్ఠామహోత్సవంలో భాగంగా ఈశ్వర అనుగ్రహం నిమిత్తం రుద్రహవనం నిర్వహించారు. బ్రహ్మ కంటి ధారల నుంచి ఆవిర్భవించిన రుద్ర స్వరూపుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రుద్రహవనం చేపట్టినట్లు ప్రధాన పురోహితుడు తెలిపారు. మంత్రపూర్వకంగా స్థాపితా దేవతారాధన చేసి ఆయా కలశాలలోని తీర్థ రాజములతో ప్రాసాద స్నపన వేడుకను నిర్వహించారు.
ప్రతిష్టామూర్తులకు, లోహమయ, శిలామయ బింబాలకు స్మార్తాగమశాస్త్ర సంప్రదాయరీతిలో అధివాస హోమాలు నిర్వహించారు. ఆయా ఉత్సవ సంబంధితమైన వేడుకల్లో భాగంగా శయ్యాధివాసం, పుష్పాధివాసం చేపట్టారు. బింబగత సౌకుమార్యాలు, మృదుత్వం ఆపాదించేందుకు ఆయా వనస్పతి దేవతలతో నిర్మించిన శయ్యపై పవళింపజేశారు. వనస్పతి దేవతా సంబంధమైన సర్వవిధ సౌకుమార్యాదులు బింబమునకు సంక్రమించే తంతు వైభవంగా సాగింది. దీంతో బింబాంతర్గత తేజో విలాసం కలుగుతుందని ప్రధాన పురోహితులు తెలిపారు. బింబాలకు అధివాసం గావించుట వల్ల పుష్పాగత సుగంధాదులు, సౌకుమార్యాలు ఆపాదితమై మూర్తుల్లో విలక్షణమైన తత్వం ఏర్పడేందుకు పుష్పాధివాసం చేపట్టారు. ఆధివాస హోమ మంత్రాలు బింబగత సర్వవిధ దోషాలను తొలగించడమేగాకుండా వాటిలో భక్తానుగ్రహ సంబంధమైన దివ్యశక్తి కలుగుతుందని స్మార్తాగమం సూచిస్తుందని ఆలయ ప్రధానార్చకులు, పురోహితులు వివరించారు. స్మృతులతో వేద ప్రతిపాదితాలైన అనేక వైభవాలు ఏర్పడునని ఈ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు.
ఉదయం 7 గంటలకు నుంచి ద్వార తోరణపూజ స్థాపిత దేవతాయజన, ప్రాసాద దిక్స్థుండిల హోమాలు, వ్యాహృతి హోమాలు, శతకృత్వోభి మంత్రణం, దేవమస్తకాభిషేకం, గర్తన్యాసం, ఉదయం 10.25 గంటలకు ధనిష్టానక్షత్ర యుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తాన పరమహంస, పరివ్రాజకాచార్య మాధవనంద సరస్వతీ స్వామి చేత సపరివార రామలింగేశ్వర స్ఫటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగ హోమం, అఘోర మంత్రహోమం, దిగ్దేవతాక్షేత్ర పాలక బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, స్వామివారి అనుగ్రహ భాషణం, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, ప్రతిష్ఠా యాగ పరిసమాప్తిని పలుకనున్నారు.
శ్రీరాంపురం(తొగుట) పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య మాధవానంద సరస్వతీస్వామిజీ ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకున్నారు. మొదటగా స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శివాలయంలో సాగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవాలను పరిశీలించారు. కొండపైన అనువంశిక ధర్మకర్త భవనంలో స్వామీజీ బస చేయనున్నారు. నేడు ఉదయం సాగే సపరివార రామలింగేశ్వర స్ఫటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగ హోమంలో పాల్గొననున్నారు.
రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి పాల్గొంటారు.
ఉత్సవమూర్తుల వేడుకల్లో పరమశివుడికి ప్రీతికరమైన శతరుద్రాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ మంత్ర పూతములైన జలాలతో నమక, చమక పారాయణాదులతో అత్యంత మహోన్నతమైన శత రుద్రాభిషేకం జరిపించారు. శతం అనగా అనంతం అని, అనంత కాల స్వరూపుడైన పరమేశ్వరుడిని పంచమృతాలు, సుగంధ ద్రవ్య, పరిమళ ద్రవ్య తీర్థ రాజములతో అభిషేకించారు. శివ పంచాక్షరి, శివజయ జయ ధ్వానాల మధ్య వేడుకను నిర్వహించారు.