యాదాద్రి రామలింగేశ్వరాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం నాలుగో రోజు యాగశాల ద్వార తోరణ పూజ, స్థాపిత దేవతాదీక్షా హోమం, మహా లింగార్చన, మహాన్యాస పారాయణం, మూలమంత్రానుష్టాన హవనాలు నిర్వహించారు. సాయంత్రం ప్రాసాద వాస్తు నిక్షేపణం, ప్రాసాద వాస్తు శాంతి,ధాన్యాధివాసం, మూర్తి పతి, లోకపాల స్థాప్యదేవతా హవనం, నీరాజన మంత్రపుష్పాల కార్యక్రమాలను స్మార్తాగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. ఈ సందర్భంగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలతో రాజోపచారాలు నిర్వహించారు. అన్నమాచార్య, త్యాగరాజ కీర్తనలు ఆలపించారు.
యాదాద్రి, ఏప్రిల్ 23 : మూలమంత్ర, లోకపాలకస్థాప్య దేవతా హవనాలు.. ప్రాసాద వాస్తుశాంతి హోమాలు.. పరమశివుడికి లింగార్చనలు మరోవైపు ప్రతిష్ఠా శిలామూర్తులకు ధాన్యాధివాస కార్యక్రమాలతో యాదాద్రి రామలింగేశ్వరాలయం మార్మోగింది. మహాలింగార్చనలు, నీరాజన మంత్రపుష్పాలతో అర్చకులు, రుత్వికులు, వేదపండితులు, పురోహితులు మహోత్సవాలను మహాద్భుతంగా కొనసాగించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం నాలుగోరోజు యాగశాల ద్వార తోరణ పూజ, స్థాపిత దేవతాదీక్షాహోమాలు, మహాలింగార్చన, మహాన్యాస పారాయణం, మూలమంత్రానుష్టాన హవనాలు నిర్వహించారు.
సాయంత్రం ప్రాసాదవాస్తు నిక్షేపణం, ప్రాసాద వాస్తుశాంతి, ధాన్యాధివాసం, మూర్తి, మూర్తి పతి, లోకపాల స్థాప్యదేవతా హవనం, నీరాజన మంత్రపుష్పాల కార్యక్రమాలు స్మార్తాగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి దంపతులు, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, ప్రధానార్చకుడు నర్సింహరామ శర్మ, ఏఈఓ దోర్భల భాస్కర్శర్మ, యజ్ఞబ్రహ్మ, ఆలయ సిద్ధాంతి, పారాయణీకులు, రుత్వికులు పాల్గొన్నారు.
పర్వత వర్థినీ సమేత రామలింగేశ్వరాలయంలో యాథావిధిగా స్థాపిత దేవతార్చన ద్వారతోరణ పూజలను పారాయణాదారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన మహాలింగార్చనను అభిషేక పర్వంగా నిర్వహించారు. అభిషేక ప్రియో రుద్రః.. కనుక శివుడికి అత్యంత ప్రీతికరమైన మహాలింగాభిషేకం అనంతరం శివ సహస్రనామాదులు, బిల్వదళార్చనలతో స్ఫటిక లింగార్చన గావించారు. విశ్వశాంతి కార్యకమైన మహాలింగార్చనలో నమక, చమకాది పారాయణాలు, శివపంచాక్షరీ జపాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
రామలింగేశ్వరాలయంలో ప్రతిష్ఠా శిలామూర్తులకు వైభవం పెంపొందింపజేసి తద్వారా విశ్వశాంతి లోక కల్యాణం గావించేందుకు ధాన్యాధివాసం నిర్వహించారు. నవవిధ భక్తి స్వరూపాలైన ధాన్యాలు, పరమేశ్వర అర్పణం చేశారు. ఈశ్వర అనుగ్రహం లభించి లోకంలో సుభిక్షం ఏర్పడునని శాస్త్ర నిర్వచనమని ప్రధానాలయ పురోహితుడు తెలిపారు. మంత్ర పూర్వకంగా నిర్వహించిన ధాన్యాధివాస హోమాలతో శిలామయ మూర్తులంతా తమలోని మాలిన్యాలను తొలగించుకోవడంతో తేజోవంతమై లోకానుగ్రహం కారకాలు కాగలవని అన్నారు.
శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా స్థాపితాదేవతార్చన, కలశారాధన నిర్వహించి ప్రాసాద వాస్తు శాంతిని నిర్వహించారు. నూతనంగా నిర్మితమైన రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాసాదాన్ని(మందిరం) మంత్రపూర్వకంగా శాంతి పాఠములతో వైదిక ప్రక్రియ నిర్వహించి శాంతిహోమాలను నిర్వహించారు.
ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాగశాల ద్వార తోరణ పూజ, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్టాన వేదహవనాలు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు రుద్రహవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిలా బ్రహ్మశిలా, పిండికాస్థాపనాలు, శయ్యాధివాసం, పుష్పాధివాసం, ప్రాసాదాధివాసం.