జగతికి ఆదర్శప్రాయుడైన జగదభిరాముడు, జనక మహారాజు పుత్రిక సీతాదేవి కల్యాణ మహోత్సవానికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. చైత్రశుద్ధ నవమి.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మేళతాళాలు, వేద మంత్రాల నడుమ సీతారాముల పెండ్లి జరిపించేందుకు అంతటా ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలంకరణలో ఆలయాలు ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఊరూవాడ మైకుల్లో శ్రీరామ నామం మార్మోగుతున్నది. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహుడి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామివారి బాలాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
సీతారాముల కల్యాణోత్సవానికి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ నెల 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉత్సవాల నిర్వహణకు అన్ని హంగులు సమకూర్చుకున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మేళ తాళాలు, భాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కల్యాణం జరుగనున్నది. పితృవాక్య పరిపాలకుడు, సకల గుణాభిరాముడు అని పిలుచుకునే రాముల వారి కల్యాణోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ వేడుకను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అంతటా షామియానాలు, చలువ పందిళ్లు వేయడంతో పాటు తాగునీరు, మజ్జిగను కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. రెండో భద్రాద్రిగా పిలుచుకునే నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదాద్రి, ఏప్రిల్ 9 : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి జిల్లా ప్రజలకు శనివారం ఒక ప్రకటనలో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. లోకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనది, తరతరాలకు ఆదర్శనీయమైనదని పేర్కొన్నారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను కోరుతున్నానని తెలిపారు.
రామగిరి, ఏప్రిల్ 9: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు సంబంధించిన వాయినాలను అర్చకస్వాములు ఇచ్చి పుచ్చుకున్నారు. ఎదుర్కోళ్ల ఉత్సవంలో అర్చకులు ఇరుపక్షాన ఉండి చేసిన ప్రధాన విశేషాలు ఆసక్తికరంగా సాగాయి.
అంతకు ముందు ఆలయంలో నిర్వహించిన పూజల్లో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చకిలం వేణుగోపాల్రావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయం వెలుపల కళావేదికపై ప్రముఖ నృత్యకారిణి నాగదుర్గ బృందం చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన అలరించింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్ తదితరులు ఆలయాన్ని పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యామ కవితా దయాకర్, ఆలయ ఈఓ మొకిరాల రాజేశ్వరశర్మ, అర్చకులు సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాచార్యులు, రఘునందనాచార్యులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.