లక్ష్మీనరసింహుడికి నిత్యారాధనలు
శ్రీవారి ఖజానాకు రూ. 21,80,066
యాదాద్రి, ఏప్రిల్16 : యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభూవుల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. తూర్పు ద్వారం నుంచి త్రితల రాజగోపురం గుండా స్వయంభూవులను దర్శించుకున్నారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాలలు భక్తులతో కిటకిటలాడాయి. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి నెలకొంది. కొండకింద పాత గోశాల వద్ద వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామికి నిత్యపూజలు తెల్లవారుజామున 4గంటల నుంచి మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. స్వామి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం భక్తులు స్వామి లడ్డూ ప్రసాదాలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. పాతగుట్ట లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలు స్తూ హోమం చేశారు. పాతగుట్టలో నిర్వహించిన నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగా లు కలుపుకుని స్వామి ఖజానాకు రూ.21,80,066 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
భక్తులు వేసవి ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు నీటి వసతి కల్పించారు. క్యూ కాంప్లెక్స్ ముందుభాగంలో టెంట్లు వేశారు. క్యూ కాంప్లెక్స్తో పాటు, మాఢ వీధుల్లో నీటి వసతి కల్పించారు. కొండ కింది నుంచి కాలినడకన వచ్చే భక్తులకు చలువ పదిళ్లు ఏర్పాటు చేశారు. శివాలయం ముందు భాగంలోని శ్రీవారి మెట్ల ప్రాంతంలో భక్తులు సేదతీరేందుకు టెంట్లు వేశారు. ఎప్పటికప్పుడు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా నడిపిస్తున్నారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో ధ్వజస్తంభానికి ఆలయ, శివాలయ ప్రధానార్చకులు, ప్రధాన పురోహితులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 20నుంచి 25వరకు శివాలయ మహాకుంబాభిషేక మహోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ప్రారంభ పూజలో భాగంగా ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేపట్టినట్లు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,69,400
వేద ఆశీర్వచనం 3,600
నిత్యకైంకర్యాలు 3,100
సుప్రభాతం 7,600
క్యారీబ్యాగుల విక్రయం 15,000
వ్రత పూజలు 1,44,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 26,200
ప్రసాద విక్రయం 13,63,800
వాహన పూజలు 10,300
సువర్ణ పుష్పార్చన 1,70,000
యాదరుషి నిలయం 92,170
అన్నదాన విరాళం 28,926
శాశ్వత పూజలు 37,500
పాతగుట్ట నుంచి 1,06,170
గోపూజ 1,400
లక్ష్మీ పుష్కరిణి 900