యాదాద్రి, సెప్టెంబర్ 28 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. విష్ణుపుష్కరిణి, పాతగుట్టలో కొలువుదీరిన హనుమంతుడి విగ్రహాన్ని సింధూరంతో అలంకరించి పంచామృతాలతో అభిషేకించారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి సహస్రనామ పఠనం, తమలపాకుల అర్చన చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బాలాలయంలో సుదర్శన నారసింహహోమం..
బాలాలయంలో స్వామివారికి సుదర్శన నారసింహహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం 4 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. దేవేరులను ము స్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించి సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం అలంకార వెం డి జోడు సేవలను నిర్వహించారు. కొండ కింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రివరకు స్వా మివారి దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ. 4,13, 283 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.