భువనగిరి మున్సిపాలిటీలో అనుమతికి మించి చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ బృందం ఉక్కుపాదం మోపుతున్నది. టీఎస్బీపాస్లో తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నది. మున్సిపాలిటీ పరిధిలో 383 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 228కి ఆమోదం లభించింది. రూల్స్ అతిక్రమించిన మూడు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. రూ.16.79లక్షల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో క్షేత్ర పరిశీలన కోసం వార్డుస్థాయి అధికారుల నియామకం చేపట్టారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అనుమతి తీసుకున్న సమయంలో ప్లాన్లో చూపినట్లుగా కాకుండా అదనంగా నిర్మించిన వాటిని కూల్చివేసే దిశగా కదులుతున్నారు. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ నుంచి టీఎస్ బీపాస్ను అమలులోకి తీసుకొచ్చింది. సరైన ధ్రువపత్రాలు జతపర్చి దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లోగా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తున్నది. ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల అధికారులు వెరిఫికేషన్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కమిషనర్ తుది అనుమతులు జారీ చేస్తున్నారు. నిబంధనలకు లోబడి ఇండ్లను నిర్మించుకుంటున్నారా లేదా అనే విషయాలను విచారించి.. చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీకి అప్పగించారు.
నివేదిక ఆధారంగా చర్యలు
టీఎస్బీపాస్ అమలులో మరింత పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం వార్డు స్థాయి అధికారులను నియమించింది. బిల్ కలెక్టర్లు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది వార్డు స్థాయి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. వీరు అక్రమ నిర్మాణాలపై విచారణ చేయనున్నారు. గతంలోనే నిర్మించుకున్న ఇండ్లను కాకుండా టీఎస్బీపాస్ కింద అనుమతి పొందిన వారి వివరాలతో క్షేత్రస్థాయికి వెళ్లి ప్లాన్ ప్రకారమే ఇండ్లు కట్టుకున్నారా? లేదా అని చూస్తారు. అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. దీనిపై టాస్క్ఫోర్స్ కమిటీకి నివేదిక అందిస్తారు. నిబంధనలు అతిక్రమించిన కట్టడాలను కూల్చివేయాలా.. లేక జరిమానా విధించాలా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే విషయమై తుది నివేదిక తీసుకునే అధికారి టాస్క్ఫోర్స్ కమిటీకే ఉంటుంది. కమిటీ తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి ఆర్డీఓ, సీఐ, ఆర్అండ్బీ ఏఈ, అగ్నిమాపక అధికారి పరిశీలించి చర్యలు చేపడతారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు నిబంధనలు అతిక్రమించిన 25 మందికి నోటీసులు జారీచేయగా, మూడు నిర్మాణాలను కూల్చి వేశారు. ప్లాన్ అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి కోర్టు ఆదేశాల మేరకు రూ.16.29లక్షల జరిమానా వసూలు చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
టీఎస్బీపాస్లో తీసుకున్న అనుమతుల ప్రకా రం నిర్మాణాలు చేపట్టాలి. వార్డు స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు అందించిన నివేదిక ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు మొదలు పెట్టాలి.