బేగంపేట్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకార్యాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈవో గుత్తా మనోహార్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఆలయం ప్రభుత్వం, దాతలు, భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.
ప్రతి ఏటా నిర్వహించే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. మొక్కుల రూపంలో భక్తులు చెల్లించిన బంగారంతో అమ్మవారికి బంగారు బోనం చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపుకు ఒక రథాన్ని చేయించాలని అమ్మవారికి బంగారు చీరను తయారు చేయించాలని సమావేశంలో నిర్ణయించారు.