రోడ్డు విస్తరణతో తగ్గిన స్తంభాల ఎత్తు
వాహనాలకు తాకేలా విద్యుత్ లైన్లు
పోల్స్ ఎత్తు పెంచాలంటున్న రైతులు, వాహనదారులు
నడికూడ, ఏప్రిల్ 2: పరకాల-హుజూరాబాద్ రహదారిలోని నడికూడ గ్రామ పరిధిలో విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా మారాయి. సింగిల్గా ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా మార్చారు. విస్తరణలో భాగంగా రహదారి ఎత్తు పెంచి రోడ్డుకిరువైపులా ఉన్న స్తంభాలను జరిపారు. నడికూడ గ్రామ పరిధిలో పాత రోడ్డుకంటే ఆరు ఫీట్ల ఎత్తు పెరుగడంతో రోడ్డుకు ఆనుకుని పొలాల గట్లపై ఉన్న స్తంభాల ఎత్తు తగ్గింది. రోడ్డుకు ఒకవైపు స్తంభం ఎత్తుగా మరోవైపు ఎత్తు తక్కువగా ఉండడంతో కరంట్ తీగలు వేలాడుతున్నాయి. తద్వారా లోడ్తో లారీలు వెళ్తున్నప్పుడు వైర్లు తాకుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరంట్ తీగలు తగిలినప్పుడు హైవోల్టేజీ వచ్చి వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలో లోడ్తో వెళ్లిన ఓ లారీ వైర్లకు తాకడంతో తెగి కిందపడ్డాయి. అవి ఓ బాలుడి కాలుకు చుట్టుకుని చనిపోయాడు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి లైన్లకు మరమ్మతులు చేసి స్తంభాల ఎత్తు పెంచే చర్యలు చేపట్టాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.
ఇవి కూడా చూడండి..
కరోనా ఎఫెక్ట్.. ముంబై – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్ప్రెస్ రద్దు
15 రోజుల కవలలకు కరోనా పాజిటివ్