వరంగల్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్ను ఆపివేస్తున్నట్లు కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, భూముల అభివృద్ధి కోసం రైతులు సహకరిస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు గోపి, రాజీవ్గాంధీ హన్మంతు, కుడా వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య, అధికారులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ కోసం ఏప్రిల్ 30న కుడా నోటిఫికేషన్ జారీ చేసింది. పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యేలను కలిసి వినతులు ఇచ్చారు. అన్నింటిపై చర్చించి భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగరం చుట్టూ ఔటర్ రింగురోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ప్రకటించింది. రైతుల అభిప్రాయాలు, వారి విజ్ఞప్తుల మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో భూ సమీకరణను నిలిపివేస్తున్నట్లు కుడా చైర్మన్ సంగరెడ్డి సుందర్రాజ్యాదవ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సర్కారు అని, ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉంటాయని అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఏ చిన్న కష్టం కలిగించరని, వ్యవసాయరంగం అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం, వరంగల్ నగరం చుట్టూ భూముల అభివృద్ధి కోసం రైతులు సహకరిస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
తాజాగా ప్రకటించిన భూసమీకరణ అంశంపై పలు గ్రామాల్లోని రైతుల నుంచి విజ్ఞప్తులు, సూచనలు రావడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, వరంగల్ కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కుడా వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య, ఇతర అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూ సమీకరణ చేపట్టేందుకు ఏప్రిల్ 30న కుడా నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లోని కొందరు ఇచ్చిన సూచనలపై చర్చించారు. పలు గ్రామాల వారు ఎమ్మెల్యేలను కలిసి ఇచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నారు. అన్నింటిపై చర్చించి భూసమీకరణ ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. భూ సమీకరణ విధానంపై ఆందోళన చెందుతున్న రైతుల కోసం ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భూ సమీకరణ నోటిఫికేషన్లో ఎక్కువ ప్రాంతం ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గంలోని రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.
భూ సమీకరణ నోటిఫికేషన్ అనంతరం పలు గ్రామాల్లో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ భూ సేకరణ అంశంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో, కుడా చైర్మన్, వైస్ చైర్మన్లతో రెండుమూడు రోజులుగా సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అరూరి రమేశ్ సూచన మేరకు బుధవారం కుడా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ల్యాండ్ పూలింగ్ విధానం పూర్తిగా భూమి యజమాని స్వచ్ఛంద భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమని తెలిపారు. ఈ ప్రక్రియలో ఏకపక్షంగా వ్యవహరించి రైతుల భూములు తీసుకోవడం ఉండదని చెప్పారు. భూమి యజమాని పూర్తి అంగీకారం తెలిపిన తర్వాతే భూ సమీకరణ చేపడుతారని అన్నారు. భూ సమీకరణ విధానంపై కొందరు ఉద్దేశ పూర్వకంగానే రైతులను తప్పుదోవ పట్టించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ రైతుల ఆర్థిక అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఏడున్నరేండ్లుగా వ్యవసాయరంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని రైతులను కోరారు. ఏ ఒక్క రైతుకు కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని, భూసమీకరణ ప్రక్రియపై అందుకే తాజా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
వరంగల్ నగరం చుట్టు 70 కిలో మీటర్లతో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉన్నది. హైదరాబాద్-ములుగు-భూపాలపట్నం జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా 29 కిలో మీటర్ల మేరకు పూర్తయ్యింది. మిగిలిన 49 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కుడా ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనికి అవసరమైన భూమి సేకరణ కోసం… హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) తరహాలోనే కుడా సైతం భూ సేకరణ ప్రక్రియ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం కిలో మీటరకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది.
దీనికి ప్రత్యామ్నాయంగా భూ సమీకరణ విధానంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు ఈ రోడ్డు వెంట ఉన్న భూములు ఉన్న వారికి లబ్ధి కలిగేలా ఈ పథకం ఉంటుంది. భూముల యజమానులకు లాభం కలిగేలా ఈ ప్రక్రియలో ఫిఫ్టి ఫిప్టి అఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైతులు అంగీకరించి ఒప్పందం చేసుకుంటే… కుడా ఆరు నెలలలో అభివృద్ధి చేసి సగం స్థలం భూ యజమానికి అందజేస్తుంది. రోడ్డు, డ్రైనేజీలు, పార్కులు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు అన్ని కుడా కల్పిస్తుంది. పూర్తిగా రైతులు, భూముల యజమానుల అంగీకారంతో ఈ ప్రక్రియ జరుతుంది. తాజాగా భూ సేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ కుడా నిర్ణయించింది.