మంచాల, అక్టోబర్ 17 : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మంచాల మండలం లింగంపల్లి గేట్ సమీపంలోని సర్వే నంబర్ 100లో నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మొదటి విడతలో 100 ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది లోపే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో అధికారుల కృషి ఎంతో ఉంది.
సొంతింటి కల నెరవేరనున్నది..
ఇల్లులేని పేదలకు సొంతింటి కల సాకారం కానున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎంపికైన పేదలకు అందజేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
అర్హులందరికీ ఇండ్లు అందజేస్తాం..
మంచాల మండలంలో లింగంపల్లి గేటు సమీపంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు అందజేస్తాం. మండలంలో ఇల్లులేని నిరుపేదలను గుర్తిస్తాం. సీఎం కేసీఆర్ కలలుగన్న డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి అయ్యాయి. త్వరలో మండలంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు అందజేస్తాం.
-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి