దళిత బంధు పథకం అమలు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అదే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన అధికారులు ఇంటింటి సర్వేను చేపట్టారు. ఈ సర్వేను సైతం ఒకటీరెండు రోజుల్లో పూర్తి చేసిన అనంతరం యూనిట్ల ఎంపికపై దృష్టి పెట్టనున్నారు. యూనిట్లపై అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన ప్రతి ఊరిలో ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఏ యూనిట్ను ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న కోణంలో ఆరా తీస్తున్నారు. యూనిట్లపై స్పష్టత వచ్చాక ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు అందజేయాలన్న లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేస్తున్నది. నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 1200 మందికి తొలిదశలో దళిత బంధు వర్తించనుంది.
నల్లగొండ ప్రతినిధి, మార్చి16(నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోనే శ్రీకారం చుట్టారు. సదరు గ్రామంలో 76 మంది లబ్ధిదారులకు నేరుగా వివిధ పథకాల ద్వారా ఉపాధి కల్పించారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10లక్షల చొప్పున కేటాయిస్తూ .. ఉపాధి పొందేలా చర్యలు చేపట్టారు. మధ్యలో దళారులకు గానీ, అవకతవకలకు గానీ ఆస్కారం లేకుండా.. ప్రతి పైసా లబ్ధిదారుడికే ఉపయోగ పడేలా పక్బందీగా పథకాన్ని రూపొందించారు. వాసాలమర్రి తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిర్మలగిరి మండలాన్ని ఎంపిక చేస్తూ అక్కడ ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు, సర్వేలను పూర్తి చేశారు. ఇదే సమయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 100 మందికి తొలిదశలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల ఎంపిక అధికారం నియోజకవర్గ ఎమ్మెల్యేకే ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎమ్మెల్యేల ద్వారా వచ్చిన ప్రతిపాదనల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం పూర్తైంది. ఇలా గుర్తించిన లబ్ధిదారులకు సంబంధించిన సర్వే కూడా దాదాపు పూర్తి కావచ్చింది. సర్వే పూర్తయ్యాక వారి వివరాలను దళితబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. నియోజవర్గాల వారీగా అప్లోడ్ పూర్తయితే తర్వాతి దశలో యూనిట్ల ఎంపికపై దృష్టి సారించనున్నారు.
లబ్ధిదారుల గుర్తింపు పూర్తయ్యాక వారి ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, జీవనోపాధికి ఉన్న అవకాశాలు, వారికున్న నైపుణ్యం, దానికి తగ్గట్టుగా వారికి ప్రయోజనకరంగా ఉండే యూనిట్ ఇలా అనేక విషయాలపై ఇప్పటికే సర్వే పూర్తి కావచ్చింది. సర్వే వివరాల ఆధారంగా యూనిట్ల ఎంపికపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన యూనిట్లపై అధికారులు త్వరలో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలో యూనిట్ల ఎంపికపై లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించిన అధికారులు.. వారికి ప్రయోజనకరంగా ఉండే యూనిట్పై అవగాహనకు వచ్చారు. వాసాలమర్రిలో ఉన్న అనుభవాల ఆధారంగా ఎక్కువ ఉపాధికి అవకాశం ఉన్న యూనిట్ల విషయమై చర్చ చేశారు. త్వరలోనే యూనిట్ల ఎంపికపైన కూడా స్పష్టత రానుంది. ఎక్కువ మంది వాహనాలు, తర్వాత వ్యవసాయ ఆధారిత యూనిట్లు, పాడి పరిశ్రమ, కిరాణాదుకాణాలు, గొర్రెలు, మేకలు వంటి యూనిట్లపైన ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిల్లో ఆయా గ్రామాల్లోని పరిస్థితులను బట్టి ఏ యూనిట్ అయితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవగాహన కార్యక్రమాలతో యూనిట్ల ఎంపికపైనా లబ్ధిదారుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. యూనిట్ల ఎంపిక పూర్తైతే ఒక్కో లబ్ధిదారుని అకౌంట్లో ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున జమ చేయనున్నది.
ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులందరికీ వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగళవారం అసెంబ్లీలోనూ సీఎం కేసీఆర్ ఈ విషయమై మాట్లాడారు. చిన్నచిన్న ఇబ్బందులు ఉంటే మినహా మిగతా అందరికీ ఈ నెలాఖరుకే దళితబంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ విషయంపైనే దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్లు సైతం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా అవాంతరాలు ఎదురైతే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలిదశలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 1200 మందికి ఈ నెలాఖరు నాటికి యూనిట్లను అందజేయాలన్న లక్ష్యంతో మూడు జిల్లాల అధికార యంత్రాంగాలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి.
దళితబంధుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజక వర్గానికి 100 మంది చొప్పున అన్ని నియోజక వర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశాం. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగానే లబ్ధిదారుల అసక్తిని బట్టి వారు ఎంచుకునే రంగాల్లో శిక్షణ ఇస్తాం. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రౌండింగ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి యూనిట్లు అందచేసేలా చర్యలు తీసుకుంటాం.
-వెంకటేశం, ఎస్సీ కార్పొరేషన్, ఈఓ, నల్లగొండ