తెలుగుయూనివర్సిటీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలనీల వారిగా క్షేత్రస్థాయి వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. గన్ఫౌండ్రీ డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్ వైద్యాధికారులు డాక్టర్ సువర్ణ, డాక్టర్ మల్లీశ్వరీల పర్యవేక్షణలో సోమవారం కాలనీలో గల పార్కులో ఏర్పాటు చేసిన టీకాల కేంద్రానికి మంచి స్పందన వచ్చింది. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ మథన్మోహన్రావు సూచించారు.
ఇప్పటివరకు మొదటి డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని అదేవిదంగా రెండవ డోసును తీసుకోవలసిన వారు ఆలస్యం చేయకుండా ఈ కేంద్రాలను సందర్శించి వివరాలు నమోదు చేసుకుని టీకాలను పొందాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే సదుద్ధేశంతో ప్రభుత్వం ప్రజల వద్దకే టీకాల కేంద్రాలను ఏర్పాటు చేసి ఇంటింటికి ఆరోగ్య కార్యకర్తలను పంపించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు డాక్టర్ ఆర్. రాఘవన్, డాక్టర్ సురేందర్సింగ్, జి. రాజగోపాల్, పి.రాజేశ్వర్, ఆదిత్య, విజయ్, నవీన్ తదితరులు పాల్గొని టీకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.