మాదాపూర్ : రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, వాణిజ్య వ్యాపారాల్లో తెలంగాణ దిక్సూచిగా నిలవడం గర్వకారణమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీనగర్ కాలనీలో సహస్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరిట ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్పోరేట్ కార్యాలయాన్ని బుధవారం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, ఆందోల్ ఎమ్మెల్యే, క్రాంతి కిరణ్లో పాటు కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లు విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలతోనే తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొని స్థిరంగా ఉందని తెలిపారు. 24 గంటల ఉచిత కరెంట్ అందివ్వడంతో పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపార రంగాలు వృద్ధి చెందుతున్నాయన్నారు.
వ్యాపారాలు బాగా జరగాలంటే రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కూడా అంతే ముఖ్యమని అన్నారు. నేడు తెలంగాణ చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలందరు గమనిస్తు నిరాజనం పడుతున్నట్లు తెలిపారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు అయిందని అన్నారు.
అనంతరం సహస్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మెన్ శంకర్ మాట్లాడుతూ … నగర వాసులకు సరసమైన ధరలకే స్థలాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జహీరాబాద్, ఇంద్రేశం, సంగారెడ్డి, బాచుపల్లి వంటి పరిసర ప్రాంతాల్లో మా ప్రాజెక్టులను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకొని కళలను సాకారం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తకాపు గోవర్ధన్రెడ్డి, జగదీష్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్, నవీన్లతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులుపాల్గొన్నారు.