మన్సూరాబాద్ : ఎల్బీనగర్, నాగోల్ డివిజన్, రాక్హిల్స్కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త, రైస్ ఏటీఎం ఫౌండర్ దోసపాటి రాము పర్సన్ ఆఫ్ ది ఇయర్ ‘ ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డును అందుకున్నారు. రాక్హిల్స్కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోసపాటి రాము వివరాలను వెల్లడించారు.
సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడే వారికి ప్రతి సంవత్సరం తమిళనాడులోని వేలూరు యూనివర్సిటీ (విఐటీ) పర్సన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ‘ది వీకెండ్ లీడర్’ అవార్డును ప్రధానం చేస్తుంది. రైస్ ఏటీఎంను స్థాపించి పేదలకు చేస్తున్న సేవలను గుర్తించిన వీఐటీ యూనివర్సిటీ ‘ది వీకెండ్ లీడర్’ 2020వ సంవత్సరానికి గాను దోసపాటి రామును ఎంపిక చేసింది.
వీఐటీ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జే. రాధాకృష్ణన్, వీఐటీ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ విశ్వనాథ్ చేతులమీదుగా దోసపాటి రాము ‘ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా దోసపాటి రాము మాట్లాడుతూ వీఐటీ యూనివర్సిటీ అందించిన ‘ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డు తన బాధ్యతను మరింతగా పెంచిందని తెలిపారు. అవార్డు ద్వార తనకు లభించిన రూ. 25 వేల పారితోషికానికి మరో రూ. 20 వేల జమచేసి ఒక పేద ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్ కొనివ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.