మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం -టోలీచౌకీ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేటీఆర్ను నియోజకవర్గం తరపున ఘన స్వాగతం పలకనున్నా మన్నారు. ఈ మేరకు శుక్రవారం విప్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. రూ.333.55 కోట్లతో 2.71 కిలో మీటర్ల మేర ఆరు వరుసలతో టు వే ఫ్లైఓవర్ను ఐటీ ఉద్యోగులు సహా ప్రజల సౌకర్యం కోసం తమ ప్రభుత్వం నిర్మించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
సెవెన్ టూంబ్ జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్ ,ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్ వాలీ జంక్షన్ ల మీదుగా పలు ప్రాంతాలను కలుపుతూ దీన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గాంధీ తెలిపారు. ఐటీ హబ్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్టిక్ట్, ఐటీ ప్రాంతంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో నిరంతరాయంగా వాహనాలు ముందుకు సాగేలా తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రాయదుర్గం- టోలిచౌకీ ఫ్లై ఓవర్ను నిర్మించిందన్నారు.
ట్రాఫిక్ రహిత ప్రయాణం కోసం ప్రభుత్వం ఐటీ ప్రాంతంలో విశేషమైన వంతెనలు, రహదారులను అందుబాటులోకి తీసుకు వచ్చిందని, 50 ఏండ్ల చరిత్రలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అయిదేండ్లలో చూపిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రజల సౌకర్యమే తమ ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యతని విప్ గాంధీ స్పష్టం చేశారు.