ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి ఫలాలను అందరికీ చేరవేయడమే ప్రధానంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని బీసీ స్టడీ సర్కిల్ ప్రాంగణాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అపజయాలకు కుంగిపోకుండా విజయం వరించేవరకు పోరాడాలని సూచించారు.
ఆత్మన్యూనత, ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ఇతరులతో పోటీపడాలన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని తమలాంటి వాళ్లం ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సైతం సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తోందని వివరించారు.
బీసీ స్టడీ సర్కిల్లో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించేందుకు తిరిగి వస్తానని చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయన్నారు. వాటిలో ఉద్యోగాలు సాధించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం చదివాలని సూచించారు.
బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర డైరెక్టర్ బాలాచారి మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. శిక్షణ వసతులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఓయూలోని బీసీ స్టడీ సర్కిల్ను మరింత విస్తరించి, అన్ని రకాల ఉద్యోగాలకు శిక్షణ అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. దీనిపై త్వరలోనే ఓయూ వీసీతో మాట్లాడనున్నట్లు తెలిపారు. అనంతరం ఉపేంద్రను ఘనంగా సన్మానించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో ఉపేంద్ర మొక్కను నాటారు.