ఆధ్యాత్మిక సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికవాది సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించారు. మహాకుంభ సంప్రోక్షణ రోజున సమయాభావం వల్ల సీఎం కేసీఆర్ అందరినీ సన్నానించలేకపోయారని, అందుకే మిగతా వారిని సన్మానించామని మంత్రులు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారి సేవలు మరువలేనివని కొనియాడారు.
యాదాద్రి, ఏప్రిల్ 3 : సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్తపతులు, ఇంజినీర్లు, జిల్లా పోలీసు అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఇతరులను ప్రభుత్వం తరపున విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆలయ పునః ప్రారంభం తరువాత పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా 30వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. యాదగిరిగుట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుందన్నారు. అభివృద్ధికి ఆధ్యాత్మికను జోడించి సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న గొప్ప దార్శనికవాది సీఎం కేసీఆర్ అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. పూజలు, ప్రార్థనలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందన్నారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఎన్నో మంచి పనులతో కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారని, వారిలో సీఎం కేసీఆర్ ఒకరని కొనియాడారు. అంతకుముందు స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు మంత్రులకు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు పాల్గొన్నారు.