హనుమకొండ, ఏప్రిల్ 1: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను అవమానించారని బీజేపీ నేతల ఆరోపణలు అర్థరహితమన్నారు. మహిళలకు గౌరవించే సంస్కృతీ సంప్రదాయం టీఆర్ఎస్ మాత్రమే ఉందని స్పష్టం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో గత నెల 29, 30వ తేదీల్లో జరిగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం బీజేపీ సభగా నిర్వహించారని ఆరోపించారు. ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు కనిపించలేదా, వారి ఫొటోలు లేకుండా ఆహ్వాన పత్రికను ముద్రించలేదా అని ప్రశ్నించారు. మహిళా మంత్రి సత్యవతిరాథోడ్ను ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించిందని చీఫ్ విప్ గుర్తుచేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను గుర్తించి ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ది అన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం కోరినా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడరని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని వారి వారి సొంత ఊర్లకు పంపడంతో పాటు సన్నబియ్యం, రూ. 500 అందజేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర టూరిజం మంత్రి కిషన్రెడ్డి టూరిస్ట్గానే వచ్చిపోయారని కానీ ఏమైనా టూరిజం ప్రాజెక్టు తెచ్చారా అని ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ పాలసీని పాటించడంతో పాటు పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం మరో ఉద్యమాన్ని చేపడుతామని చీఫ్ విప్ హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల మతాలకతీతంగా అన్ని పండుగలు నిర్వహించేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని అమలు చేశారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణకు ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సింది పోయి కేంద్రం కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు. బీజేపీ నాయకుల మాటలను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి పాల్గొన్నారు.