ఖైరతాబాద్ : పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం లబ్ధిదారుల గుర్తించే కార్యక్రమానికి హాజరైన ఆయన గృహాల నిర్మాణాలను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి, ఆర్డీఓ వసంత, తహసీల్దార్ అన్వర్తో కలిసి పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలు అర్హులైన వారికి తప్పకుండా అందుతాయని, అందులో పారదర్శకత పాటించేందుకే నేరుగా లబ్ధిదారుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పేదలకు అన్ని హంగులు, వసతులతో కలిపి ఇండ్లు నిర్మిస్తుండటం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు.
అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ అధికారులు చెప్పిన విధంగా మొదటి దఫాలో 111 మంది లబ్ధిదారులను గుర్తించామని, మొత్తం 211 మంది లబ్ధిదారులకు గృహాలు ఇస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ వసంతతో కలిసి కార్పొరేటర్ పి. విజయా రెడ్డి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు.