మహేశ్వరం: రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో రైతుబంధు సంబురాలలో బాగంగా మన్సాన్పల్లి చౌరస్తా నుండి మహేశ్వరం రైతువేదిక వరకు రైతులు, గిరిజనులతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలి నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు.
అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. రైతు బంధు పథకం ద్వారా రైతుల అకౌంట్లలో 50 వేల కోట్లను జమచేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిచారని ఆమె అన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణదినమని అన్నారు. సంక్రాంతి పండుగను మరిపించిన రైతు బంధు సంబురాలని ఆమె అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున రైతులు గిరిజనులు మద్దతు తెలపడం పట్ల ఆమె సంతోషాన్ని వెలిబుచ్చా రు. రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోతారని అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులకు సీఎం కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతో రైతులు ముందుకు పోతున్నారని ఆమె అన్నారు.
తెలంగాణలో చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేని పక్క రాష్ట్రాల నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది బీజేపీ నేతలకు కనబడడం లేదా అని ఆమె ప్రశ్నించారు. మీ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ వంటి పథకాలు అమలు చేస్తున్నారా అని అన్నారు.
ఢిల్లీలో రైతులను చంపి గల్లీలో మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన రైతుల నుండి, తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ను విడదీయలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వరి పంటలో పంజాబ్ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందని ఆమె అన్నారు. దీనికి సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అందించిన ప్రోత్సాహకమే అని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యా నాయక్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య, మండల రైతుబంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.