యాదాద్రి ప్రధానాలయంలో ఈ నెల 28 నుంచి శ్రీలక్ష్మీనరసింహుడి దర్శన భాగ్యం భక్తులకు కలుగబోతున్నది. భక్తుల రద్దీ గతంలో కంటే ఎక్కువగానే ఉండనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై క్యూలైన్లలో వెళ్లి స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చే వరకు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆలయ
ఈఓ గీత ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు.’
తెలంగాణ : పంచకుండాత్మక యాగాన్ని భక్తులు దర్శించుకోవచ్చా?
ఈఓ: ఈ నెల 21న మొదలైన యాగం 27 వరకు జరుగుతుంది. యాగానికి ప్రత్యేకించి ఎవరినీ అనుమతించడం లేదు. బాలాలయంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఈ యాగాన్ని వీక్షించవచ్చు.
నమస్తే తెలంగాణ : మార్చి 28న భక్తులకు స్వామి దర్శనాన్ని ఎప్పుడు కల్పించనున్నారు?
ఈఓ : మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు 28న ఉదయం నుంచే మొదలవుతాయి. మహాపూర్ణాహుతి తర్వాత సువర్ణమూర్తులను శోభాయాత్రతో ప్రధానాలయానికి తీసుకువస్తాం. ఉదయం 11.55 గంటలకు ఆలయ గోపురాలకు సంప్రోక్షణ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాతే భక్తులకు స్వయం భువులను దర్శించుకునే అవకాశం కల్పించనున్నాం. దర్శనాలు ఉదయం పూటనే ఉంటాయని భావించి ఎవరూ కొండపైకి రావొద్దు.
నమస్తే తెలంగాణ : భక్తుల దర్శనాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
ఈఓ : ఎంతోకాలంగా భక్తులు స్వయంభువుల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయం ప్రారంభోత్సవం తర్వాత రద్దీ ఎక్కువగానే ఉండనుంది. దర్శనాల సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశాం. ఇక్కడే స్టే చేయకుండా కేవలం స్వామి దర్శనం కోసమే వస్తే రోజుకు 60వేల మందికి కూడా దర్శనం కల్పించే ఏర్పాట్లు ఉన్నాయి. క్యూకాంప్లెక్స్లోకి వచ్చే భక్తులను జియోట్యాగింగ్ చేయనున్నాం. దీనివల్ల నిత్యం ఎంతమంది స్వామి దర్శనం కోసం వస్తున్నారో తెలుస్తుంది. దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీకనుగుణంగా తగు చర్యలు తీసుకునే వీలుంటుంది.
నమస్తే తెలంగాణ : రవాణా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు.?
ఈఓ : ఆలయం ప్రారంభం తర్వాత కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు. బస్సుల్లోనే భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ కూడా రవాణా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఈనెల 28 నుంచి 75 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి బస్సు 20 ట్రిప్పులు తిప్పేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతారు. క్రమక్రమంగా సౌకర్యాలను, వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
నమస్తే తెలంగాణ : స్వామి వారి దర్శనానికి ఎంత సమయం పట్టే
అవకాశం ఉంది?
ఈఓ : తిరుపతి తిరుమల తరహాలో దర్శనానికి చర్యలు చేపడుతున్నాం. ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియ ఈనెల 28 నుంచే ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి గతంలోనే ట్రయల్ రన్ నిర్వహించాం. ఈనెల 25న మరోసారి పూర్తిస్థాయిలో ట్రయల్ రన్ నిర్వహిస్తాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే భక్తులను గుట్టపైకి పంపిస్తాం. గతంలో సువర్ణపుష్పార్చన, వీఐపీల ప్రొటోకాల్ దర్శనాల సందర్భంగా భక్తులు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై బ్రేక్ దర్శనం సమయంలోనే ప్రొటోకాల్ దర్శనాలు ఉంటాయి. ఎంత సేపటికి దర్శనం అవుతుందన్నది కచ్చితంగా చెప్పగలుగుతాం. కొండపైన ఉన్న క్యూకాంప్లెక్స్లోకి వచ్చాక కేవలం గంటలోపే స్వామి దర్శనం కలుగుతుంది.
నమస్తే తెలంగాణ : వసతుల పరంగా చేపడుతున్న ఏర్పాట్లు ఏమిటి?
ఈఓ : యాదాద్రి పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. వసతుల పరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా కొన్ని అందుబాటులోకి రావాల్సి ఉంది. భక్తులు సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నాం. ఈనెల 25న శివాలయం, 28న లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం. పంచకుండాత్మక యాగం సందర్భంగా ఈ నెల 21 నుంచి కొండ కింద అన్నదానం కొనసాగిస్తున్నాం. 28 తర్వాత దీక్షాపరుల మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని కూడా ఆలయం ప్రారంభోత్సవం తర్వాత వారం, పదిరోజుల్లో ప్రారంభిస్తాం. అన్నప్రసాద సముదాయం ఐదు నెలల తర్వాతనే అందుబాటులోకి రానుంది. క్యూకాంప్లెక్స్లో తాగు నీరు, టాయిలెట్స్ సదుపాయాలను కల్పించాము. ఏసీ సౌకర్యం కూడా ఉంది. భక్తులకు తాగునీరు అందించేందుకు దివీస్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.2.50కోట్లతో క్షేత్రం పరిధిలో 15 చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం నాటికి 8 ప్రాంతాల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి. ఐదారు నెలల్లో పూర్తిస్థాయిలో అన్నిరకాల వసతులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న వసతులు రద్దీకి తగ్గట్టుగా లేనందున భక్తులు కేవలం స్వామి దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటేనే మంచిది.