గుక్కెడు తాగు నీటి కోసం ఏండ్ల తరబడి తండ్లాడిన రాజు తండా నేడు సమస్యలన్నింటినీ అధిగమించి అభివృద్ధిలో రారాజుగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటై తనను తాను తీర్చిదిద్దుకున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను శరగంగా పూర్తి చేయడంతో తండా రూపురేఖలు మారిపోయాయి. మిషన్ భగీరథ పథకంతో తండా వాసుల తాగు నీటి కష్టాలు తొలిగిపోయాయి. హరితహారం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటుతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వీధుల్లో సీసీ రోడ్డు, విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు గ్రామ ముఖ చిత్రాన్ని మార్చివేశాయి. ఆవాస గ్రామాలైన బొక్కల తండా, కస్నతండాను సైతం ప్రగతి పథంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం, అధికారుల సహకారం, ప్రజా ప్రతినిధుల చొరవ ఫలితంగా రాజు తండా ఆదర్శంగా నిలుస్తున్నది. రాజుతండాతో పాటు బొక్కల తండా, కస్నతండాలో 774 మంది జనాభా, 192 నివాసాలు, 480ఓటర్లు ఉన్నారు. గత సంవత్సరం ఇంటి పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేసి ఆదర్శగ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాదీ పన్ను వసూళ్లు 50శాతంపూర్తయ్యాయి.
అభివృద్ధి పనులివీ..
రూ.12.50లక్షలతో వైకుంఠధామం, రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.2.5 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.5లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.3.5లక్షలతో డ్రైనేజీల నిర్మాణం, రూ.6లక్షలతో ఫార్మేషన్ రోడ్డు పూర్తి చేశారు.
పచ్చదనం, పారిశుధ్యం..
గ్రామంలో పచ్చదనం, పారిశుధ్య పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేందించేందుకు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్తులు చెత్తను ట్రాక్టర్కు అందించి పారిశుధ్యంలో భాగస్వాములవుతున్నారు.
20రకాల మొక్కలు…
సర్పంచ్ భద్రూ నాయక్ 15గుంటల స్థలాన్ని వైకుంఠ ధామం కోసం విరాళమిచ్చారు. మరో 2 గుంటలు మిషన్ భగీరథ సంపు నిర్మాణం కోసం దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉపాధి హామీ నిధులతో సుమారు రూ.5లక్షలతో 30గుంటల్లో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 20రకాలకు చెందిన 1,200మొక్కలు నాటారు. వేప, మర్రి, చింత, జామ, తులసి, ఉసిరి, మామిడి, దానిమ్మ, సీమ తంగేడు, గుల్మొహర్, గులాబీ, నంది వర్ధనం, సహా పలు రకాలైన పండ్లు, పూల మొక్కలు పెంచారు. హరిత హారంలో మొక్కలు నాటేందుకు నర్సరీ ఏర్పాటు చేశారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు..
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికీ తాగు నీరు అందుతున్నది. గతంలో నీటి కోసం గ్రామస్తులు వ్యవసాయ బావులను ఆశ్రయించేవారు. కానీ, నేడు ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత జలాలు అందుతున్నాయి. రూ.13లక్షలతో సంపు నిర్మిస్తున్నారు.
తొలిగిన విద్యుత్ సమస్యలు…
గ్రామంలో గతంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ లైన్లు, కరెంట్ కష్టాలు ఉండేవి. నేడు పల్లె ప్రగతిలో భాగంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు సరిచేసి గ్రామస్తులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. కొత్త బల్బులతో రాత్రి వేళల్లో వీధులన్నీ కాంతివంతంగా కనిపిస్తున్నాయి.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా…
ప్రభుత్వం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధతో గ్రామాన్ని నందనవనంగా మార్చుకున్నాం. ఎప్పటికప్పుడు చెత్త సేకరించి, మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నాం. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.
ధరావత్ భద్రూనాయక్, సర్పంచ్