సూర్యాపేట, సెప్టెంబర్ 14 : మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామీణం.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను పట్టణాలకే ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. పల్లెల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని భావించిన సీఎం కేసీఆర్ గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం -2018 తీసుకువచ్చి గ్రామ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామాలను అద్దంలా తయారు చేసి అన్ని రకాల సమస్యలను పరిష్కరించారు. వీటికితోడు గ్రామాల్లో పచ్చదనం, ఆహ్లాదం కోసం మెగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. 10 ఎకరాల స్థలంలో రూ.45 లక్షల వ్యయంతో ఈ పార్కులు నిర్మాంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున మెగా పల్లె ప్రకృతి వనాలు మంజూరు చేయగా.. మరో 4 మెగా వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రూ.159.75 కోట్లతో 355 పార్కులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.159.75 కోట్లతో 355 మెగా పార్కులను నిర్మించనున్నారు. నల్లగొండ జిల్లాలోని 31 మండలాల పరిధిలో 155, సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో 115, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాల పరిధిలో 85 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థల సేకరణ సైతం చేశారు. మూడు జిల్లాల్లో దాదాపు 85 శాతం స్థల సేకరణ పూర్తయింది. పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్కులో సుమారు 20 రకాలకు చెందిన 40 వేల మొక్కలు నాటనున్నారు. పది ఎకరాల స్థలాన్ని నాలుగు భాగాలుగా విభజించి మధ్యలో, పార్కు చుట్టూ నడవడానికి ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. మధ్యలో చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్కు.. ఇందులో గ్రీనరీతోపాటు బల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క భాగంలో 35 వేల మొక్కలు నాటనున్నారు. పది ఎకరాల చుట్టూ కంచె వేసి మూడు వరుసల్లో మూడు మీటర్ల వెడల్పులో 5వేల మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పార్కులు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సవాల్గా స్థలాల సేకరణ
ఒకేచోట పది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూముల సేకరణ అధికారులకు కత్తిమీద సాముల తయారైంది. మండలానికి ఒకటి చొప్పున స్థలం సేకరించడానికి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. మరో 4 పార్కుల కోసం స్థలాల సేకరణ సవాల్గా మారింది. ప్రభుత్వ భూములు ఉన్నా.. అవి ఎక్కువ కొండ ప్రాంతాలు కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పలు చోట్ల పార్కుల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు. స్థలాల సేకరణకు సహకరించాలని జిల్లాలోని ఎమ్మెల్యేలను సైతం ఆదేశించారు.
పల్లెలకు కొత్తందాలు..
రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 5 మెగా ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్థలాల కోసం రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. త్వరలోనే స్థలాలను గుర్తించి పార్కుల ఏర్పాటు ప్రారంభిస్తాం. మెగా పార్కులతో గ్రామాలకు కొత్త అందాలు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్కుల నిర్మాణం చేపడుతాం. 20 రకాల మొక్కలతో పార్కులు అందంగా, ఆహ్లాదకరంగా ఉండనున్నాయి.