కోదాడ రూరల్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా టీకాను వేయించుకోవాలని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శైలజ సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్లో ఆమె పాల్గొని మాట్లాడారు. 45ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
చింతలపాలెం/హుజూర్నగర్ రూరల్ : 45ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని కరోనా ప్రత్యేకాధికారి మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని దొండపహాడ్లో నిర్వహించిన కొవిడ్ టీకా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 100మందికి కరోనా టీకాలు వేసి 48మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నపురెడ్డి పద్మావతి, మెడికల్ ఆఫీసర్ కిరణ్కుమార్, స్టాఫ్నర్స్ ఎస్తేరు రాణి, సూపర్వైజర్ లక్ష్మి, వరలక్ష్మి, కళ్యాణి, విజయలక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూర్నగర్ మండలంలోని వేపలసింగారంలో శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ వరప్రసాద్ పల్లెప్రకృతి వనాన్ని, శానిటేషన్, నీటి సరఫరా నిర్వహణను పరిశీలించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీఓ మౌలానా, సర్పంచ్ శిరీషాకొండారెడ్డి, కార్యదర్శి పెండెం నాగమణి, సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
పాలకవీడు/నేరేడుచర్ల : ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తాసీల్దార్ రవికిరణ్కుమార్ ఒక ప్రకటనలో సూచించారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించనివారికి జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. నేరేడుచర్ల పట్టణంలోని జాన్పహాడ్ రోడ్డులో మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న ఐదుగురికి ఎస్ఐ యాదవేంద్రరెడ్డి జరిమానా విధించారు.
వలస కూలీలకు కరోనా పరీక్షలు
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని శ్రీనివాసపురంలో వలస కూలీలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సర్పంచ్ పత్తిపాటి రమ్యానాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోకి వరికోత, బోర్లు వేసే పనుల నిమిత్తం ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 42మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. కరోనా టీకా వేయించుకునేందుకు 23మందిని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, శ్రవణ్, సైదులు, మస్తాన్, ఆశ కార్యకర్తలు సునీత, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
పొదలకూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం