గజ్వేల్, సెప్టెంబర్ 26: గజ్వేల్ నియోజకవర్గం పర్యాటక శోభతో కళకళలాడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, మిషన్ కాకతీయతో పాండవుల చెరువు, హరితహారంతో అర్బన్ పార్కులాంటి సౌందర్యాలు, ప్రకృతి వేదికలుగా పర్యాటకులను కనువిందు చేస్తూ ఉల్లాసాన్ని పంచుతున్నాయి. ఆధ్యాత్మిక నిలయాలైన వర్గల్ విద్యా సరస్వతి, కొండపోచమ్మ, నాచగిరి లక్ష్మీనృసింహ దేవాలయాలను సందర్శించిన భక్తులు, సందర్శకులు ఈ ప్రాంతాలను కూడా సందర్శించి వెళ్తుంటారు.
ఆకట్టుకుంటున్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు
రైతులకు సాగునీటిని అందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ 15టీఎంసీల సామర్థ్యంతో గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్లో కొండపోచమ్మ సాగర్ను ఏర్పాటు చేశారు. ఈ రిజర్వాయర్ ఇప్పుడు నిండుగా ఉన్న కాళేశ్వరం జలాలతో కనువిందు చేస్తున్నది. సెలవు రోజుల్లో సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుండడంతో పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
పచ్చని అందాలతో అర్బన్ పార్కు..
మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ అటవీ ప్రాంతాన్ని గజ్వేల్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ప్రతిరోజు ప్రజలు తమ కుటుంబాలతో సందర్శించి సంతోషంగా గడుపుతుంటారు. ఈ అర్బన్పార్కులు రాశివనం, నక్షత్రవనం, గజ్బౌల్లతో పాటు అడవి అందాలను, వాతావరణాన్ని రాత్రంతా ఆస్వాదించడానికి చిన్నచిన్న కుటీరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, నవాబుల కాలం నాటి మల్కబావి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
ఉల్లాసానికి వేదిక పాండవుల చెరువు..
మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ చేసే వాకింగ్ ప్రియులకు పాండవుల చెరువు వేదికగా మారింది. ఈ చెరువును మినీట్యాంక్బండ్లా మార్చి సుందరంగా తీర్చిదిద్దారు. బోటింగ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు.